శ్రీ విశాలాక్షీ దేవి
Tue, Jun 18, 2013, 07:27 PM

భూలోకంలో అధర్మం పెరిగిపోతుండటంతో, పరిపాలన చేపట్టి ధర్మాన్ని కాపాడమని 'దివో దాసు'అనే క్షత్రియుడిని కోరాడు బ్రహ్మదేవుడు. అయితే దేవతలంతా భూలోకం విడిచి వెళితేనేగాని తాను పరిపాలనా బాధ్యతలను స్వీకరించనని దివోదాసు తేల్చిచెప్పాడు. ఆ సమయంలోనే శివుడు కూడా కాశీ నగరాన్ని వదలి కైలాసానికి వెళ్లిపోయాడు.
కాలం గడుస్తున్నా కొద్దీ కాశీ నగర వియోగాన్ని పరమ శివుడు తట్టుకోలేకపోయాడు. దివోదాసు భూలోకాన్ని ప్రజారంజకంగా పాలిస్తుండటం వల్ల, అతనికి ఇచ్చిన మాటను కాదని కాశీకి రాలేకపోయాడు. ఇది గమనించిన వినాయకుడు దివోదాసుకి వైరాగ్యాన్ని కలిగించి, అతనే శివుడిని ఆహ్వానించేలా చేశాడు.
దివోదాసు ఆహ్వానం అందుకున్న శివుడు ఆనంద తాండవం చేస్తూ కాశీ క్షేత్రంలో కాలుపెట్టాడు. పట్టరాని ఆనందంతో వస్తోన్న శంకరుడిని పార్వతీదేవి తన కళ్లను విశాలం చేసుకుని చూస్తూ మురిసిపోయిందట. ఈ కారణంగానే అమ్మవారిని విశాలాక్షి అని పిలుస్తూ వుంటారు.