ఇక్కడి శివుడిని రాత్రి వేళలో స్త్రీగా అలంకరిస్తారు

శ్రీకృష్ణుడి లీలావిశేషాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పరమపవిత్రమైన పుణ్యస్థలిగా 'బృదావనం' కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో చూడవలసినవాటిలో బడే కుంజ్ లోని 'గోపీశ్వర మందిరం' ఒకటి. ఈ దేవాలయంలో రాత్రివేళలో శివుడికి స్త్రీ అలంకారం చేస్తారు. అందుకు కారణంగా ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.

పరమశివుడికి శ్రీకృష్ణుడితో కలిసి రాసలో పాల్గొనాలనే కోరిక కలిగింది. రాసలో ఇతర పురుషులకు ప్రవేశం లేకపోవడం వలన, శివుడు స్త్రీ వేషాన్ని ధరించి రాసకు వస్తాడు. స్త్రీ రూపంలో వున్న శివుడిని చూసి రాధ అసూయపడుతుంది. రాస జోరుగా జరుగుతూ ఉండగా .. మేలి ముసుగు జారిపోవడం వలన శివుడి నిజ రూపం అందరి కంట పడుతుంది. సాక్షాత్తు శివుడే వచ్చినందుకు అందరూ ఆనందిస్తారు. ఈ కారణంగానే ఇక్కడి శివలింగానికి రాత్రివేళ స్త్రీ అలంకారం చేస్తారు. ఇక్కడి శివలింగంపై కనిపించే చిహ్నాలను గోపికల వేలిముద్రలుగా చెబుతారు.       


More Bhakti News