భారీ వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండండి.. సీఎస్ సోమేశ్ కుమార్ తో సమీక్షించిన సీఎం కేసీఆర్

Related image

హైదరాబాద్, సెప్టెంబర్ 27:: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సమీక్షించారు. గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సీఎం స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో రెవిన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్ లలో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికకారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు.

డీజీపీ ఎమ్. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్పీలని ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు.

సీఎస్ సోమేశ్ కుమార్ తో సమీక్షించిన గవర్నర్ తమిళిసై:తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఫోన్ చేసి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ సమీక్షించారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని గవర్నర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

More Press Releases