రాష్ట్రంలో సంవత్సరం పొడవునా ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాలు: తెలంగాణ సీఎస్

Related image

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆజాదీ కా అమృతోత్సవ్ ను పురస్కరించుకొని ఈ నెల నుండి సంవత్సరం పాటు రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర 75 సంవత్సరం సందర్బంగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో అవగాహన కలిగించడానికే రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 75 ప్రాంతాల నుండి ఒక్కొక్క బృందం 75 కిలోమీటర్లు సాగే విధంగా సైకిల్ ర్యాలీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్రోద్యమంపై స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామని అన్నారు.

తెలంగాణలో జరిగే అతిపెద్ద పండగైన బతుకమ్మ పండగను కూడా 75 ఏళ్ల స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగించేదిగా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న సాంస్కృతిక సారధి బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామని వివరించారు. ఐ.టి.రంగం, తెలుగు సినిమా పరిశ్రమలతో కలిపి కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ద్వారా పలు సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు.

More Press Releases