అనుమతి లేకుండా చెట్లు కొట్టేసినందుకు భారీ జరిమానా

Related image

  • 20 లక్షల రూపాయల ఫైన్ వేసి, వసూలు చేసిన అటవీ శాఖ
మేడ్చల్: ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అటవీ శాఖ భారీ జరిమానా విధించింది. వెంచర్ ను విస్తరించటంలో భాగంగా వందలాది చెట్లను నరికేసిన సంస్థకు ఇరవై లక్షల రూపాయల భారీ జరిమానాను విధించి, వసూలు చేసింది అటవీ శాఖ.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బొమ్మరాస్ పేట్ లో వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్ లో పది రోజుల కిందట భారీగా చెట్లను సరికివేశారు. ఫిర్యాదు అందుకున్న మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు విచారణ జరిపించారు. వెంచర్స్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది భారీ వృక్షాలను నరికేసిన విషయాన్ని నిర్థారించారు. వాల్టా యాక్ట్  కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు కోల్పోయిన పచ్చదనానికి బదులుగా భారీగా జరిమానా విధించారు.

అదే సంస్థతో మళ్లీ పెద్ద ఎత్తున మొక్కలు కూడా నాటిస్తామని అధికారులు తెలిపారు. సొంత భూముల్లో అయినా చెట్లు కొట్టేందుకు అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, అన్ లైన్ లోనూ అప్లయ్ చేసుకోవచ్చని అటవీ అధికారులు తెలిపారు.

ఎవరైనా చెట్లు కొట్టేందుకు అనుమతి కోరితే, విచారణ జరిపి, నిబంధనల ప్రకారం అనుమతి ఇస్తామని, కొద్ది మొత్తంలో అయితే జిల్లా అటవీ అధికారి, పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించాల్సి వస్తే డిస్ట్రిక్ట్ ట్రీ ప్రొటెక్షన్ కమిటీ విచారణ తర్వాత అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపుకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చెట్ల నరికి వేతను నివారించాలని, తప్పనిసరి అయితే మాత్రం చట్ట ప్రకారం అనుమతులు పొందిన తర్వాతే చెట్ల తొలగింపును చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ వెల్లడించారు.

More Press Releases