Kollu Ravindra: మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అరెస్ట్

  • వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూమి కేటాయింపు
  • కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న కొల్లు రవీంద్ర
  • మచిలీపట్నంలో నిరసన ప్రదర్శన.. అడ్డుకున్న పోలీసులు
  • గూడూరు పీఎస్ కు కొల్లు రవీంద్ర తరలింపు
Police arrests Kollu Ravindra in Machilipatnam

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ప్రదర్శనలో కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారంటూ కొల్లు రవీంద్ర తదితరులు ఆందోళన చేపట్టారు. ఆ ప్రభుత్వ భూమిని కొల్లు రవీంద్ర మీడియా ప్రతినిధులకు చూపించేందుకు ప్రయత్నించారు. 

ఈ నేపథ్యంలో, పోలీసులు రంగప్రవేశం చేసి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రి అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. 

కొల్లు రవీంద్రను అక్కడి నుంచి తరలించడాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొల్లు రవీంద్రను బలవంతంగా అక్కడి నుంచి తరలించడంతో, పరిస్థితి సద్దుమణిగింది.

More Telugu News