KCR: దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్

  • నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ 
  • దేశ పరిస్థితులను చూశాక టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చామన్న కేసీఆర్
  • నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య
  • తమది రాజకీయ పోరాటం కాదని, జీవన్మరణ పోరాటమని వెల్లడి
kcr meeting at nanded maharashtra

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశ పరిస్థితులను చూశాక టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చామని చెప్పారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతటా రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. భారత్ పేద దేశం కాదని, అమెరికా కంటే ధనిక దేశమని, బుద్ధి జీవుల దేశమని చెప్పుకొచ్చారు. 

ఈరోజు మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. తాము ఎన్నాళ్లో ఎదురు చూశామని, ఇప్పుడు సమయం వచ్చిందని, నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన టైం వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు కాదని, ప్రజలు, రైతులు గెలవాలని అన్నారు.

దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. దేశంలో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి మరెక్కడా లేదని, కానీ ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో అనేక నదులు ఉన్నా నీటి కరువు ఎందుకని ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో కూటములు పాలన చేశాయని, కానీ మనదేశం ఆశించిన అభివృద్ధి సాధించలేదని అన్నారు. దేశంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని, దేశ నాయకత్వంలో మార్పు వస్తేనే ప్రగతి సాధ్యమని చెప్పారు. 

‘‘స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ 54 ఏళ్లు, బీజేపీ 16 ఏళ్లు పాలించాయి. ఏం సాధించాయి? రెండూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. మాంజాలు, విగ్రహాలు, పతంగులు, చివరికి జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయి. దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయి?’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని, జీవన్మరణ పోరాటమని చెప్పారు. ‘అబ్‌కీ బార్.. కిసాన్‌ సర్కార్’ నినాదంతో ముందుకు వచ్చామని కేసీఆర్‌ చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశంలో ఉందని, మరి ఇంత విశాల భారత్ లో కనీసం 2 వేల టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు లేదని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వవచ్చని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయొచ్చని తెలిపారు.

More Telugu News