Pakistan: పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు

  • బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టాలో భారీ విస్పోటనం
  • పోలీస్ ప్రధాన కార్యాలయానికి దగ్గర్లోనే ఘటన
  • 5 మందికి పైగా గాయాలు
Huge blast in Pakistans Quetta leaves many injured

పాకిస్థాన్ మరోసారి భారీ బాంబు పేలుడుతో వణికిపోయింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టాలో ఈ రోజు పేలుడు సంభవించగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ సీ ముస్సా చెక్ పాయింట్ దగ్గర ఘటన జరిగిందని, ఐదుగురికి పైగా గాయపడ్డారని పాకిస్థాన్ న్యూస్ సైట్ ‘డాన్’ తెలిపింది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

క్వెట్టా కంటోన్మెంట్ ప్రవేశం వద్ద.. క్వెట్టా పోలీస్ ప్రధాన కార్యాలయానికి దగ్గర్లో భద్రత ఉన్న ప్రాంతంలోనే బాంబు పేలినట్లుగా స్థానిక మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. బాంబు పేలిన తర్వాత ఆకాశంలో కొన్ని మీటర్ల వరకు తెల్లటి పొగ కమ్ముకోవడం కొన్ని వీడియోల్లో కనిపించింది. పోలీసులు, అత్యవసర బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో గాలిస్తున్నాయి.

ఐదు రోజుల కిందట పెషావర్ లోని మసీదులో తాలిబన్ సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో.. 100 మందికి పైగా చనిపోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు. భారీ భద్రత ఉన్న చోట, సెక్యూరిటీ డ్రస్ లో వచ్చి ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. వారం రోజులు కూడా గడవకముందే పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది.

More Telugu News