Chiranjeevi: ఆయనతో నాది తండ్రీకొడుకుల అనుబంధం: చిరంజీవి భావోద్వేగం

  • పితృ సమానులైన విశ్వనాథ్ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్న చిరంజీవి
  • తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంస
  • విశ్వనాథ్ కీర్తి అజరామరమైనదన్న మెగాస్టార్
Chiranjeevi emotional tweet on K Vishwanath

కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని అన్నారు. పితృ సమానులైన ఆయన ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆయన గొప్పదనాన్ని చెప్పటానికి మాటలు చాలవని అన్నారు. పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైనదని చెప్పారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలింలను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు ఇంకొకరు లేరని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహాదర్శకుడు అని కొనియాడారు. 


ఆయన దర్శకత్వంలో 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం తనకు లభించిందని చిరంజీవి తెలిపారు. తనకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధం అని... అంతకు మించి తండ్రీకొడుకుల అనుబంధమని చెప్పారు. ఆయనతో గడిపిన సమయం తనకు అత్యంత విలువైనదని అన్నారు.   

ప్రతి నటుడికీ ఆయనతో పని చేయడం ఒక విద్య లాంటిదని చిరంజీవి చెప్పారు. ఆయన చిత్రాలు భావి దర్శకులకు ఒక గైడ్ లాంటివని అన్నారు. 43 సంవత్సరాల క్రితం ఆయన తీసిన ఐకానిక్ చిత్రం 'శంకరాభరణం' విడుదలైన రోజే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా ఆయన కైలాసానికి ఏతెంచారని చెప్పారు. 

ఆయన చిత్రాలు, చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవని చిరంజీవి కొనియాడారు. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నానని చెప్పారు.

More Telugu News