Team India: న్యూజిలాండ్ పై 168 పరుగులతో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం

  • 234 పరుగులు చేసిన టీమిండియా
  • 66 రన్స్ కే కుప్పకూలిన న్యూజిలాండ్
  • 126 పరుగులతో చెలరేగిన శుభ్ మన్ గిల్
India wins T20 series against New Zealand

అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 168 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది. ఛేజింగ్ లో 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ప్లేయర్లలో మిచెల్ 35 పరుగులు, శాంట్నర్ (13) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. ముగ్గురు బ్యాట్స్ మెన్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, ముమ్రాన్ మాలిక్, శివమ్ మావిలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 


అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. యువ సంచలనం శుభ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి, న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 63 బంతులను ఎదుర్కొన్న గిల్ 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన టీ20 కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు. 

ఇషాన్ కిషన్, గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే కేవలం మూడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్ ఒక పరుగు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి 44 (22 బంతులు, 3 సిక్సర్లు, 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ 24 (13 బంతులు, 2 సిక్సర్లు, 1 ఫోర్), హార్దిక్ పాండ్యా 30 (17 బంతులు, 1 సిక్సర్, 4 ఫోర్లు)  పరుగులు సాధించారు. దీపక్ హుడా 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, సోధి, మిచెల్ చెరో వికెట్ సాధించారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభ్ మన్ గిల్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు.

More Telugu News