Nara Lokesh: లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు షెడ్యూల్ ఇదే.. కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన యాత్ర

  • పాదయాత్రకు ముందు ఉత్సాహంగా ‘సెల్ఫీ విత్ లోకేశ్’ కార్యక్రమం
  • నిన్న 14.9 కిలోమీటర్లు నడిచిన యువనేత
  • నేడు వివిధ సామాజిక వర్గాల నేతలతో సమావేశం
  • రాత్రికి రామాపురంలో బస
Nara Lokesh Yuva Galam Padayatra Started sixth day at Kammanapalle

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ, వారి సమస్యలు వింటూ ఆయన ముందుకు సాగుతున్నారు. అలాగే, వివిధ సామాజిక వర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఐదో రోజైన నిన్న లోకేశ్ 14.9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తంగా 58.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 

యువగళం పాదయాత్ర నేటితో ఆరో రోజుకు చేరుకుంది. ఈ ఉదయం 8 గంటలకు కమ్మనపల్లె సమీపంలోని కస్తూర్బా స్కూల్ విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు ‘సెల్ఫీ విత్ లోకేశ్’ కార్యక్రమం జరిగింది. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులతో ఆయన ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. 

కాగా, 10.20 గంటలకు బెల్లుపల్లి క్రాస్ వద్ద వాల్మీకి సామాజికవర్గం వారితో లోకేశ్ సమావేశం అవుతారు. 11.50 గంటలకు కొలమసానిపల్లె పెట్రోలు బంకు సమీపంలో మహిళలతో సమావేశం అవుతారు. 1.05 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 5.45 గంటలకు గొల్లపల్లి సమీపంలో ఎస్సీ ప్రముఖులతో లోకేశ్  సమావేశం అవుతారు. 6.30 గంటలకు రామాపురం ఎమ్మెస్ ఆసుపత్రి ఎదుట విడిది కేంద్రంలో లోకేశ్ బస చేస్తారు.

More Telugu News