lic: అదానీ గ్రూప్ తో మాట్లాడుతాం.. ప్రశ్నించే హక్కు మాకుంది: ఎల్ఐసీ

  • హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో పడిపోతున్న అదానీ కంపెనీల షేర్లు
  • వీటిలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ
  • అదానీ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతామని తాజాగా వెల్లడి
lic to talk to adani group over hindenburg report have right to ask questions

హిండెన్ బర్గ్ రీసెర్చ్ దెబ్బకు అదానీ సామ్రాజ్యం షేక్ అవుతోంది. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్ల విలువ భారీగా పడిపోతోంది. లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి. అదానీకి సంబంధించిన కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), ఎస్ బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ యాజమాన్యంతో మాట్లాడుతామని ఎల్ఐసీ తాజాగా ప్రకటించింది. తాము అదానీ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టామని, అవసరమైన మేరకు ప్రశ్నించే హక్కు తమకు ఉందని వ్యాఖ్యానించింది. 

ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ సోమవారం ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. ‘‘వాస్తవ స్థితి ఏమిటో మాకు తెలియదు.. మేం (అదానీ గ్రూప్ లో) పెద్ద పెట్టుబడిదారులం. కాబట్టి అవసరమైన ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది. మేం కచ్చితంగా వారితో సంప్రదింపులు జరుపుతాం’’ అని వెల్లడించారు.

మరోవైపు తమ కంపెనీపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని అదానీ గ్రూప్‌ చెప్పింది. తమ గ్రూప్ వ్యాపారాల్లో ఎలాంటి అవకతవకలు కనుగొనలేకపోయిందని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేష్ ఇందర్ సింగ్ చెప్పారు. ఈ ఆరోపణలను తమ కంపెనీపై చేసిన దాడిగా మాత్రమే చూడకూడదని, దేశీయ సంస్థల స్వాతంత్య్రం, సమగ్రత, విశ్వసనీయత, దేశ అభివృద్ధిపై దురుద్దేశపూర్వక దాడిగా చూడాలని కోరారు.

More Telugu News