Nara Lokesh: లోకేశ్ పాదయాత్రకు కర్ణాటక పోలీసుల భారీ భద్రత... ఫొటోలు ఇవిగో

  • కర్ణాటక గుండా కొనసాగిన నారా లోకేశ్ పాదయాత్ర
  • లోకేశ్ తో కలిసి నడిచిన కర్ణాటక పోలీసులు
  • కర్ణాటక పెట్రోల్ బంక్ లో తన కాన్వాయ్ లోని వాహనాలకు పెట్రోల్ పట్టించిన లోకేశ్
Karnataka police security for Nara Lokesh padayatra

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పెద్ద సంఖ్యలో వస్తున్న టీడీపీ శ్రేణుల మధ్య ఉత్సాహంగా సాగుతోంది. మరోవైపు పాదయాత్ర కొనసాగుతున్న మార్గం పొరుగు రాష్ట్రం కర్ణాటక సరిహద్దుల గుండా వెళ్లడంతో ఆయన కర్ణాటకలో సైతం తన పాదయాత్రను కొనసాగించారు. కర్ణాటకలోని పంతాన్ హళ్లి గుండా పాదయాత్ర కొనసాగింది. దీంతో, తమ రాష్ట్రంలో కొనసాగిన లోకేశ్ పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రతను కల్పించారు. లోకేశ్ తో కలిసి వారు నడిచారు. ఈ సందర్భంగా కర్ణాటక పోలీసులకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు పంతాన్ హళ్లి పెట్రోల్ బంక్ లో తన కాన్వాయ్ లోని వాహనాలకు లోకేశ్ దగ్గరుండి పెట్రోల్ కొట్టించారు. అనంతరం తానే స్వయంగా డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా ఏపీలోని పెట్రోల్, డీజిల్ రేట్లకు, కర్ణాటక రేట్లకు మధ్య ఉన్న తేడాను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102గా, డీజిల్ ధర రూ. 88గా ఉందని తెలిపారు. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.50... డీజిల్ ధర రూ. 99.27గా ఉందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై జగనన్న బాదుడే బాదుడు అంటూ దుయ్యబట్టారు. తనతో పాటు నడుస్తున్న కార్యకర్తలకు, ప్రజలకు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రేట్ల తేడాను వివరించారు. దేశంలోనే ఏపీలో రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

More Telugu News