Amshala Swamy: ఫ్లోరైడ్ విముక్త పోరాట నాయకుడు అంశాల స్వామి మరణం బాధాకరం: పవన్ కల్యాణ్

  • ఓ ప్రమాదంలో కన్నుమూసిన అంశాల స్వామి
  • ట్రైసైకిల్ పైనుంచి పడడంతో తలకు బలమైన దెబ్బ
  • ఫ్లోరోసిస్ పై జాతీయస్థాయిలో గళం వినిపించారన్న పవన్ కల్యాణ్
  • అంశాల స్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
Pawan Kalyan condolences to Amshala Swamy death

జన్మతః ఫ్లోరోసిస్ బాధితుడు, ఫ్లోరైడ్ రక్కసిపై అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు అంశాల స్వామి (32) ఇవాళ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ట్రైసైకిల్ పైనుంచి పడిన ఆయన తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఫ్లోరైడ్ విముక్త పోరాట నాయకుడు అంశాల స్వామి మరణం బాధాకరమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం నుంచి తమ ప్రాంతాన్ని విముక్తం చేయాలంటూ అంశాల స్వామి మూడు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. స్వయంగా ఫ్లోరోసిస్ బాధితుడు అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనవంటి బాధిత ప్రజల పక్షాన సొంత ప్రాంతం నుంచే పోరు మొదలుపెట్టి జాతీయస్థాయిలో గళం వినిపించారని పవన్ కల్యాణ్ వివరించారు. 

అంశాల స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబానికి తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News