Somu Veerraju: ఏపీలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ: సోము వీర్రాజు

  • సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ 48 గంటల దీక్షను చేపట్టిందన్న వీర్రాజు 
  • ఎస్సీలను వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శ 
  • రాష్ట్రంలో అభివృద్ధే లేదని కామెంట్ 
Somu veerraju fires on YSRCP

ఏపీలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటల దీక్ష చేపట్టిందని చెప్పారు. ఇతర పార్టీలు కేవలం మీటింగ్ లు మాత్రమే పెట్టి వెళ్లిపోయాయని అన్నారు. ఏప్రిల్ లో విజయవాడలో ఎస్సీల బహిరంగసభను నిర్వహించబోతున్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తొండియా కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ, ఎస్సీలను వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధే లేదని అన్నారు. వైసీపీ నేతలంతా మాఫియా నాయకుల్లా మారిపోయారని దుయ్యబట్టారు. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. జగన్ అమలు చేస్తున్న నవరత్నాల కంటే ప్రధాని మోదీ సంక్షేమమే ఎక్కువని అన్నారు. తాము సంక్షేమం చేస్తుంటే... వైసీపీ ప్రభుత్వం చంపేస్తోందని విమర్శించారు.

More Telugu News