Jacqueline: సుకేశ్ నా జీవితాన్ని నరకం చేశాడు.. ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ స్టేట్మెంట్

  • తనను తప్పుదోవ పట్టించాడని ఆరోపించిన బాలీవుడ్ నటి
  • కెరీర్ ను నాశనం చేశాడని ఆవేదన వ్యక్తంచేసిన జాక్వెలిన్
  • తనకు ఖరీదైన బంగ్లా ఆఫర్ చేశాడన్న నోరా ఫతేహీ
  • మనీలాండరింగ్ కేసులో పటియాల కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చిన హీరోయిన్లు
Jacqueline says Sukesh Chandrashekhar made her life hell

సన్ టీవీ యజమానిననీ, దివంగత నేత జయలలిత బంధువునని చెప్పి పరిచయం చేసుకున్న సుకేశ్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశాడని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆరోపించారు. తన కెరీర్ ను నాశనం చేసి, జీవనాధారాన్ని పోగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బుధవారం పటియాలా కోర్టులో ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. సౌత్ ఇండియా సినిమాల్లో కలిసి పనిచేద్దామంటూ సుకేశ్ తనను తప్పుదోవ పట్టించాడని జాక్వెలిన్ కోర్టుకు తెలిపారు. 

సుకేశ్ నుంచి తను అందుకున్న ఖరీదైన బహుమతుల జాబితాను కోర్టుకు అందజేశారు జాక్వెలిన్.. ఈ జాబితాలో 5 విలువైన గడియారాలు, మసాజ్ చెయిర్, 20 డిజైనర్ నగలు, 47 జతల ఖరీదైన బట్టలు, ఖరీదైన 4 హ్యాండ్ బ్యాగులు, 9 పెయింటింగ్స్ ఉన్నాయి.

ఖరీదైన బంగ్లా ఆఫర్ చేశాడు: నోరా ఫతేహీ
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జాక్వెలిన్ తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహీ కూడా ఢిల్లీలోని పటియాల కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు. సుకేశ్ చంద్రశేఖర్ తనకు ప్రపోజ్ చేశాడని, తన గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇస్తానని చెప్పాడన్నారు. సుకేశ్ సహాయకురాలు పింకీ ఇరానీ ద్వారా తనకు అతను పరిచయమయ్యాడని కోర్టుకు వివరించింది.

More Telugu News