Samantha: పుకార్లకు చెక్ పెడుతూ ముంబై చేరుకున్న సమంత! ​

  • మయోసైటిస్‌’ వ్యాధితో బాధపడుతున్న సమంత
  • చికిత్స కారణంగా కొన్నాళ్లు షూటింగ్స్ కు దూరం 
  • హిందీ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లిన హీరోయిన్
Samantha Ruth Prabhu arrives in Mumbai amid reports of her being replaced in Citadel

దక్షిణాదిలో వరుస సినిమాలతో దూసుకెళ్తూ.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, ఫుష్ప సినిమాలో ప్రత్యేక పాటతో హిందీలో కూడా గుర్తింపు తెచ్చుకున్న సమంత కెరీర్ జోరుకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. ‘మయోసైటిస్‌’ అనే వ్యాధి కారణంగా ఆమె కొంతకాలం ఇబ్బంది పడింది. తను ప్రధాన పాత్రలో నటించిన యశోద విడుదల సమయంలో ఈ సమస్య గురించి సమంత స్వయంగా వెల్లడించింది. సెలైన్ పెట్టుకొని యశోదకు డబ్బింగ్ చెప్పిన సామ్ తర్వాత కొన్ని నెలల పాటు చికిత్స కొనసాగించింది. ఈ క్రమంలో తను సినిమాలకు విరామం ఇచ్చింది. చాలా కాలం పాటు బయట కనిపించకపోవడంతో ఆమె కెరీర్ విషయంలో రకరకాల పుకార్లు వినిపించాయి.

హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి ‘సియాటెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్ గా ఆమెను తప్పించి మరొకరిని తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలకు సమంత చెక్ పెట్టింది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్  కోసం ఆమె ముంబై చేరుకుంది. ముంబై ఎయిర్ పోర్టులో వైట్ క్యాస్ట్యూమ్స్‌లో ఉన్న సమంతను ఫొటోలు తీసేందుకు అక్కడి ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఇప్పుడీ ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. చాన్నాళ్ల తర్వాత సమంతను బయట చూసిన ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు. ‘సియాటెల్‌’ షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. 

 మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ట్రైలర్‌‌ను ఈనెల 9న విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో తన పాత్రకు సమంత డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. డబ్బింగ్ చెబుతున్న విషయం తెలియజేస్తూ, ఇటీవల సమంత సోషల్‌ మీడియాలో ఓ ఫొటో కూడా షేర్ చేసింది. ఇప్పుడు ముంబై వెళ్లడంతో అనారోగ్యం నుంచి ఆమె పూర్తిగా కోలుకుందని, మునుపటిలా వర్క్ లో బిజీ అవుతుందని భావిస్తున్నారు.

More Telugu News