TRS: ఏడాదిలోనే 5 రెట్లు పెరిగిన బీఆర్ఎస్ ఆదాయం.. తాజా ఆస్తుల విలువ రూ. 480 కోట్లకు జంప్

  • ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి రూ. 218.11 కోట్ల ఆదాయం
  • గతేడాది రూ. 16.21 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడి
  • రూ. 27.93 కోట్ల ఖర్చులు అయినట్టు ఎన్నికల సంఘానికి నివేదిక
BRS properties value jumps

చందాల రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు ఆదాయం వస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ఇబ్బడి ముబ్బడిగా చందాలు రావడం సహజం. పలు రూపాల్లో వచ్చే ఆదాయాల లెక్కలను పార్టీలు.. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేస్తుంటాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ఆదాయం ఒక్క ఏడాదిలోనే ఐదు రెట్లు కంటే ఎక్కువ పెరిగింది. తెలంగాణలో అధికార పార్టీ ఆదాయం గతేడాది మార్చి 31 నాటికి రూ. 37.65 కోట్లుగా ఉంది. ఒక్క ఏడాది తిరిగే సరికి రూ. 218.11 కోట్ల ఆదాయం లభించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 31నాటికి తమ ఆదాయ లెక్కలను బీఆర్ఎస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. 

ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏకంగా రూ. 153 కోట్ల ఆదాయం సమకూరిందని బీఆర్ఎస్ తెలిపింది. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ. 40 కోట్లు వచ్చాయని, ఇతర ఆదాయాల రూపంలో రూ. 16 కోట్లు సమకూరినట్టు తెలిపింది. ఏడాది కాలంలో రూ. 27.93 కోట్ల ఖర్చు అయినట్టు వెల్లడించింది. మొత్తంగా రూ. 190 కోట్ల నికర ఆదాయం లభించిందని తెలిపింది. దాంతో, తమ తాజా ఆస్తుల విలువ రూ. 480.75 కోట్లకు చేరుకుందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం నాటికి పార్టీ ఆస్తుల విలువ రూ. 288.24 కోట్లు ఉండగా.. ఏడాది తిరిగే సరికి దాదాపు రెట్టింపు అవడం గమనార్హం.

More Telugu News