Team India: రెండో టెస్టులో పంత్ మెరుపు అర్ధ సెంచరీ

  • 94కే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్
  • బంగ్లా బౌలర్లపై పంత్ ఎదురుదాడి 
  • తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులు చేసిన బంగ్లా
Fifty for Rishabh Pant against bangladesh

బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో భారత టాపార్డర్ నిరాశ పరిచింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం దెబ్బకు మొదటి నలుగురు బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే వందలోపే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఢీలా పడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బంగ్లా బౌలర్లపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 19/0 తో రెండో రోజు, శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆట మొదలైన కొద్దిసేపటికే తన వరుస ఓవర్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), శుభ్ మన్ గిల్ (20) ను ఎల్బీగా ఔట్ చేశాడు. 38/2తో నిలిచిన ఇన్నింగ్స్ ను సీనియర్లు చతేశ్వర్ పుజారా (24), విరాట్ కోహ్లీ (24) ఆదుకునే ప్రయత్నం చేశారు. 

అయితే, లంచ్ కు ముందు పుజారాను తైజుల్ వెనక్కి పంపాడు. దాంతో తొలి సెషన్  లో భారత్ 86/3 స్కోరుతో నిలిచింది. అయితే, బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే విరాట్ కోహ్లీ.. తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో పెవిలియన్ చేరడంతో భారత్ 94/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ తోడుగా రిషబ్ దూకుడుగా ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతున్న పంత్ 49 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ 55 ఓవర్లకు 190/4 స్కోరుతో నిలిచింది. పంత్ 68, శ్రేయస్ 40 పరుగులతో ఉన్నారు.

More Telugu News