K Kavitha: బీఆర్ఎస్ ఏర్పాటుపై దేశ వ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది: ఎమ్మెల్సీ కవిత

  • బీఆర్ఎస్ లో చేరుతామని ఎంతో మంది కోరుతున్నారన్న కవిత
  • కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా పేద ప్రజల సంక్షేమం కోసమేనని వ్యాఖ్య
  • నిజామాబాద్ ను అద్భుత నగరంగా తీర్చి దిద్దుతామన్న కవిత
Many are interested in joining BRS says Kavitha

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా, ఏ కార్యక్రమాన్ని చేపట్టినా పేద ప్రజల సంక్షేమం కోసమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రూ. లక్షా 116 సాయం చేస్తున్నారని... దేశంలో ఎక్కడైనా ఇలాంటి పథకం ఉందా? అని ప్రశ్నించారు. గతంలో కరెంటు లేక ఎన్నో బాధలు పడ్డామని... అప్పుడు కరెంటు వస్తే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అని చెప్పారు. నిజామాబాద్ లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు చెక్కులను ఈరోజు కవిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 

నిజామాబాద్ ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని కవిత అన్నారు. నగరంలో ఉన్న పాత భవనాలను కూల్చేస్తామని చెప్పారు. పాత కలెక్టరేట్ ప్రదేశంలో కళాభారతిని, మైనార్టీలకు హజ్ హౌస్ ను నిర్మిస్తామని తెలిపారు. పాత బస్టాండ్ ను తొలగించి రైల్వే స్టేషన్ దగ్గర కొత్త బస్టాండ్ ను నిర్మిస్తామని చెప్పారు. నగరంలో నలుమూలలా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

బీఆర్ఎస్ ఏర్పాటుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, మంచి స్పందన వస్తోందని కవిత అన్నారు. బీఆర్ఎస్ లో చేరుతామని ఎంతో మంది కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ పుత్రుడు కేసీఆర్ దేశ వ్యాప్తంగా విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టే అవకాశం కనపడుతోందని అన్నారు.

More Telugu News