Sargam Koushal: మిసెస్ వరల్డ్‌గా కశ్మీరీ మహిళ.. వైజాగ్‌తోనూ అనుబంధం!

  • లాస్‌వేగాస్‌లో మిసెస్ వరల్డ్ పోటీలు
  • 21 ఏళ్ల తర్వాత భారత్ సొంతమైన మిసెస్ వరల్డ్ కిరీటం
  • వైజాగ్‌లో టీచర్‌గా పనిచేసిన కౌశల్ సర్గమ్
Indias Sargam Koushal Is Mrs World 2022 and Brings Crown Back After 21 Years

మిసెస్ వరల్డ్ పోటీల్లో భారతీయ వనిత సత్తా చాటింది. లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల సర్గమ్ కౌశల్ ప్రపంచంలోనే అత్యంత అందమైన శ్రీమతి (మిసెస్ వరల్డ్) టైటిల్‌ను అందుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 63 దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. అందరినీ వెనక్కి నెట్టేసిన సర్గమ్ 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు. 2001లో డాక్టర్ అదితి గోవిత్రీకర్ మిసెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ కిరీటాన్ని సర్గమ్ చేజిక్కించుకున్నారు. 

కౌశల్ సర్గమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ప్రకారం.. ఆమె ఇంగ్లిష్ లిటరేచర్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్‌తోనూ అనుబంధం ఉంది. విశాఖపట్టణంలో ఆమె టీచర్‌గానూ పనిచేశారు. ఆమె భర్త నేవీ ఉద్యోగి. పెళ్లయిన మహిళల కోసం 1984లో తొలిసారిగా మిసెస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహించారు. తొలుత వీటిని ‘మిసెస్ విమెన్ ఆఫ్ ద వరల్డ్’ అన్న పేరుతో నిర్వహించారు. 1988లో దీనిని ‘మిసెస్ వరల్డ్’గా మార్చారు. ఈ పోటీల్లో 80 దేశాల వారు పొల్గొంటున్నారు. అమెరికా మహిళలు ఎక్కువసార్లు కిరీటాన్ని అందుకున్నారు. ఇండియాకు చెందిన నటి, మోడల్ డాక్టర్ అదితీ గోవిత్రీకర్ 2001లో తొలిసారి ఈ పోటీల్లో విజేతగా నిలవగా, 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు కశ్మీరీ మహిళ కౌశల్ సర్గమ్ మిసెస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు.

More Telugu News