paleti ramarao: 2034లో నేను చనిపోతా.. నా మరణదిన వేడుకలకు రండి: ఏపీ మాజీ మంత్రి

  • అభిమానులకు వినూత్న ఆహ్వాన లేఖ పంపిన పాలేటి రామారావు
  • ఇకపై ఏటా మరణదిన వేడుకలు జరుపుకుంటానని వెల్లడి
  • ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన ఆహ్వాన లేఖ
AP Ex Minister Paleti Rama Rao Variety Invitation Goes Viral

వివాహానికో, గృహ ప్రవేశానికో లేక పుట్టిన రోజు వేడుకలనో.. శుభకార్యాలకు ఆహ్వాన పత్రికను ముద్రించి బంధుమిత్రులకు పంపించడం సాధారణమే! కానీ నా మరణదిన వేడుకలు ఘనంగా చేసుకుంటున్నా, మీరు తప్పకుండా రావాలని ఆహ్వాన పత్రిక అందుకుంటే ఎలా ఉంటుంది? ఇదేం ఆహ్వానం అనిపించకమానదు. 

ఆంధ్రప్రదేశ్ లోని ఓ రాజకీయ నాయకుడి అనుచరులు, అభిమానులు కూడా ఇప్పుడు అలాగే ఫీలవుతున్నారు. తమ అభిమాన నాయకుడు మరణదిన వేడుకలకు రమ్మంటూ ఆహ్వాన లేఖ పంపడమే దీనికి కారణం. చీరాల ఐఎంఏ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే వేడుకలకు హాజరవ్వాలని పాలేటి రామారావు అభిమానులను కోరారు. ఏపీ మాజీ మంత్రి పాలేటి రామారావు పంపిన ఆ లేఖలో ఏముందంటే..

‘ఏటా జరుపుకునే పుట్టినరోజు వేడుకలు అర్థరహితమని తెలుసుకున్నా.. అందుకే ఇకపై మరణదిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నా. ఇన్నాళ్ల నా జీవితాన్ని పరిశీలించుకున్నాక నా మరణ సంవత్సరాన్ని 2034 గా నిర్ణయించుకున్నా. దానికి ఇంకా 12 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం మరణదిన వేడుకలు జరుపుకుంటాను. ఆ వేడుకలకు మీరు హాజరై, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అంటూ రామారావు ఆ లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి పంపిన ఈ లేఖ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

పుట్టిన ప్రతీ ఒక్కరికీ మరణం తప్పదని, బతికి ఉన్నంత కాలం ఇతరులకు వీలైనంత సాయం చేయాలే తప్ప అపకారం చేయొద్దని రామారావు చెప్పారు. ఈ విషయం గుర్తెరిగి తాను ఎంతకాలం జీవించాలని అనుకుంటున్నాడో ఆలోచించి, మరణానికి ఓ తేదీని నిర్ణయించుకుని ఏటా మరణదిన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. భగవంతుడు ఎంత బోధించినా మనిషి తన జీవన విధానాన్ని, ఆలోచనను పూర్తిగా సరిచేసుకోవడంలేదని అన్నారు.

More Telugu News