Shubhman Gill: గిల్ సెంచరీ... 450 దాటిన భారత్ ఆధిక్యం

  • తొలి టెస్టులో విజయంపై కన్నేసిన భారత్
  • రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా టీమిండియా బ్యాటింగ్
  • రాణించిన గిల్, పుజారా
  • కాసేపట్లో డిక్లేర్ చేసే అవకాశం
Gill shines with century as Team India lead crossed 450 mark

బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భారత్ మ్యాచ్ విజయంపై కన్నేసింది. రెండో ఇన్నింగ్స్ లో యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాధించగా, భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. గిల్ 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 110 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 23 పరుగులు చేసి ఖాలెద్ అహ్మద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 55 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేయగా, పుజారా 74, కోహ్లీ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 471 పరుగులకు చేరింది. ఆటకు నేడు మూడో రోజే కావడంతో, బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే, మరో రెండ్రోజులు బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ ఫాలోఆన్ లో పడినప్పటికీ రెండో ఇన్నింగ్స్ ఆడడానికే భారత్ మొగ్గుచూపింది.

More Telugu News