Bangladesh: టీమిండియా దెబ్బకు బంగ్లాదేశ్ చిత్తు.. ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా

  • తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్
  • టీమిండియాకు 254 పరుగుల భారీ ఆధిక్యత
  • 5 వికెట్లను తీసిన కుల్దీప్ యాదవ్
Bagladesh all out for 150 runs in first innings against Team India

ఛట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. ఈరోజు (మూడో రోజు) 133/8 స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మరో 17 పరుగులు మాత్రమే జోడించి 150 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్ మెన్లలో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. ముష్ఫికర్ రహీమ్ చేసిన 28 పరుగులే అత్యధిక వ్యక్తిగత పరుగులు కావడం గమనార్హం. ఇతర బ్యాట్స్ మెన్లలో జాకీర్ హసన్ 20 పరుగులు, లిట్టన్ దాస్ 24, హసన్ మీరజ్ 25 రన్స్ చేశారు. 55.5 ఓవర్లకు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 

బంగ్లా బ్యాటింగ్ లైనప్ ను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ మొహమ్మద్ సిరాజ్ లు కకావికలం చేశారు. కుల్దీప్ యాదవ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లను కూల్చగా, సిరాజ్ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లను తీశాడు. ఉమేశ్ యాదవ్, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీశారు. 

తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 254 పరుగుల భారీ ఆధిక్యత లభించింది. బంగ్లాదేశ్ ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ... రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని టీమిండియా నిర్ణయించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ మైదానంలోకి అడుగుపెట్టారు. తొలి ఓవర్ ను బంగ్లా బౌలర్ ఖలీద్ అహ్మద్ వేస్తున్నాడు.

More Telugu News