Palla Rajeshwar Reddy: సజ్జల వ్యాఖ్యల వెనుక బీజేపీ కుట్ర ఉంది: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా

  • రాష్ట్ర విభజనను వెనక్కి తీసుకోవాలని మాట్లాడుతున్నారని పల్లా మండిపాటు
  • సజ్జల వ్యాఖ్యలను ఆషామాషీగా భావించడం లేదని వ్యాఖ్య
  • తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని విమర్శ
BJP is behing Sajjala comments says Palla Rajeshwar Reddy

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్లీ కలవడమే తమ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... సజ్జల వ్యాఖ్యలను తాము ఆషామాషీగా భావించడం లేదని... వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్ర విభజనను వెనక్కి తీసుకోవాలంటూ విషపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇప్పటికే వైఎస్ షర్మిల, కేఏ పాల్ వంటి బాణాలను బీజేపీ వదిలిందని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని చెప్పారు. ఎనిమిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని... కేసీఆర్ నాయకత్వంలో దూసుకుపోతోందని పల్లా అన్నారు. దేశంలో మరే రాష్ట్రం సాధించలేని అభివృద్ధిని సాధించామని చెప్పారు. దేశాభివృద్ధి కోసం పని చేసే అవకాశం బీఆర్ఎస్ ద్వారా దక్కుతుందని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పును తీసుకొచ్చే దిశగా బీఆర్ఎస్ పని చేస్తుందని చెప్పారు.

More Telugu News