sms: టెక్స్ట్ మెసేజ్ కు 30 ఏళ్లు.. తొలి ఎస్ఎంఎస్ ఎవరు, ఎవరికి పంపారో తెలుసా?

  • మెర్రీ క్రిస్మస్ అంటూ తొలి సందేశం
  • తన బాస్ కు పంపించిన వొడాఫోన్ ఇంజనీర్
  • 1992 డిసెంబర్ 3 న బెర్క్ షైర్ లో ఫస్ట్ ఎస్ఎంఎస్
First Text Message Marks 30 Years On December 3

ఇప్పుడంటే అన్ని పనులూ అరచేతిలోని స్మార్ట్ ఫోన్ తోనే చేసేస్తున్నాం కానీ మొబైల్ వచ్చిన కొత్తలో కేవలం ఫోన్ చేసుకోవడానికి మాత్రమే వీలయ్యేది. కిలోల కొద్దీ బరువుతో మొబైల్ ఫోన్ ను వెంట తీసుకెళ్లడం కాస్త అసౌకర్యంగానే ఉండేదట. షార్ట్ మెసేజ్ సర్వీస్(ఎస్ఎంఎస్) గా వ్యవహరించే సంక్షిప్త సందేశాలు పంపించుకునే వెసులుబాటు తొలుత 1992లో మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

అప్పట్లో వొడాఫోన్ ఇంజనీర్ ఒకరు తన బాస్ కు తొలి ఎస్ఎంఎస్ పంపించారు. 1992 డిసెంబర్ 3న బెర్క్ షైర్ కు చెందిన వొడాఫోన్ ఇంజనీర్ నెయిల్ పాప్ వర్త్ ‘మెర్రీ క్రిస్మస్’ అంటూ తన బాస్ రిచర్డ్ జార్వీస్ కు ఎస్ఎంఎస్ చేశారు. క్రిస్మస్ పార్టీకి వెళ్లిన జార్వీస్ కు ఈ సందేశం పంపించారు. అప్పట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన లేటెస్ట్ మొబైల్ ఆర్బీటెల్ 901 మోడల్ ను జార్వీస్ వాడుతుండేవారు. ఇది 2.1 కిలోల బరువు ఉండేదట. 

అయితే, పార్టీలో ఉండడంతో తను ఈ సందేశానికి జవాబు ఇవ్వలేకపోయానని జార్వీస్ చెప్పారు. ఎస్ఎంఎస్ ఇంత ప్రాచుర్యం లభిస్తుందని ఊహించలేదంటూ జార్వీస్ అభిప్రాయపడ్డారట. ప్రస్తుతం వాట్సాప్ సహా ఇతరత్రా యాప్ లు అందుబాటులోకి రావడంతో ఎస్ఎంఎస్ ల ప్రభ తగ్గిపోయింది.

More Telugu News