Chintamani: చింతామణి నాటకాన్ని నిషేధించడంపై ఏపీ హైకోర్టులో విచారణ

  • చింతామణి నాటకాన్ని నిషేధించిన ఏపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని రఘురామకృష్ణరాజు పిటిషన్
  • విచారణను తదుపరి వారానికి వాయిదా వేసిన హైకోర్టు
Hearing in AP HC on Chintamani drama

'చింతామణి' నాటకం దశాబ్దాల పాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాటకంపై నిషేధం విధించింది. ఒక సామాజికవర్గం మనోభావాలు దెబ్బతీనే విధంగా నాటకం ఉందనే కారణంతో నాటకాన్ని నిషేధించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. రఘురాజు తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర కోర్టులో వాదనలు వినిపించారు. 

చింతామణి ఒక సందేశాత్మక నాటకమని... దాన్ని నిషేధించడం సరికాదని అన్నారు. నాటకాన్ని నిషేధించడం వల్ల ఎంతో మంది కళాకారుల ఉపాధి దెబ్బతిన్నదని చెప్పారు. వ్యభిచారం నిరోధానికి కూడా ఈ నాటకం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఒక కులం మనోభావాలు గాయపడ్డాయని నాటకాన్ని నిషేధిస్తే... ఇతర కులాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరారు. వాదనలను విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

More Telugu News