Andhra Pradesh: మంత్రి జయరాం భార్య కొనుగోలు చేసిన భూములను అటాచ్ చేసిన ఐటీ శాఖ

  • కర్నూలు జిల్లా ఆస్పరిలో రేణుకమ్మ పేరిట 30.83 ఎకరాల కొనుగోలు
  • ఈ వ్యవహారంలో రేణుకమ్మకు ఐటీ నోటీసులు వచ్చాయంటూ వార్తలు
  • తమకెలాంటి నోటీసులు రాలేదన్న మంత్రి గుమ్మనూరు జయరాం
  • సాయంత్రానికే రేణుకమ్మ ఆస్తులు అటాచ్ చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు
it officials attaches ap minister jayaram wifes lands

బినామీల పేరిట ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబం భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిందన్న వ్యవహారంలో ఆదాయపన్ను శాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా ఆస్పరిలో జయరాం భార్య రేణుకమ్మ పేరిట కొనుగోలు చేసిన 30.83 ఎకరాల భూమిని ఐటీ శాఖ ముందస్తు జప్తు చేసింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం కింద ఈ భూములను ఐటీ శాఖ జప్తు చేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం హైదరాబాద్ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఓ వైపు తమకెలాంటి ఐటీ నోటీసులు రాలేదంటూ మంత్రి జయరాం ప్రకటించిన తర్వాత కూడా ఐటీ శాఖ రేణుకమ్మ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. రేణుకమ్మకు ఐటీ నోటీసులు వచ్చాయంటూ గురువారం ఉదయం వార్తలు వినిపించగా... మధ్యాహ్నానికే మీడియా ముందుకు వచ్చిన జయరాం... తమకు ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని ప్రకటించారు. అంతేకాకుండా తామేమీ బినామీ పేర్ల మీద ఆస్తులు కొనలేదని కూడా ఆయన ప్రకటించారు. మంత్రి ప్రకటన తర్వాత ఐటీ శాఖ రేణుకమ్మ ఆస్తులను ముందస్తు జప్తు చేయడం గమనార్హం.

More Telugu News