Thopudurthi Prakash Reddy: పరిటాల రవి అనుచరుడితో మా అమ్మను తిట్టించారు.. మాకు బాధ ఉండదా?: ఎమ్మెల్యే తోపుదుర్తి

  • చంద్రబాబు హయాంలో 150 హత్యలు జరిగాయన్న తోపుదుర్తి 
  • సూరిని భానుతో చంపించింది పరిటాల సునీతేనని వ్యాఖ్య  
  • మా అన్నను పరిటాల రవి చంపాలని చూశారని ఆరోపణ 
Paritala Ravi tried to kill my brother says Thopudurthi Prakash Reddy

తనను చంపొచ్చనుకున్నారని... ఇప్పుడు తన కుమారుడు లోకేశ్ ని టార్గెట్ చేసినట్టున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 150 హత్యలు జరిగాయని... తమ ప్రాణాలకు హాని తలపెడతారనే ఆందోళనతోనే తన అన్న చంద్రశేఖర్ రెడ్డి అలా మాట్లాడారని చెప్పారు. తన అన్నను అప్పట్లో పరిటాల రవి చంపాలని చూశారని ఆరోపించారు. పరిటాల రవి హయాంలో ఎంత మందిని హత్య చేశారో అందరికీ తెలుసని అన్నారు. కాటికి కాలు చాపుకున్న చంద్రబాబును చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని చెప్పారు.   

మద్దెలచెరువు సూరి కుటుంబం మొత్తాన్ని పరిటాల రవి చంపించారని... అందుకే రవిని చంపి సూరి ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పారు. 2009 ఎన్నికల్లో తనను ఓడించేందుకు జైల్లో ఉన్న సూరితో రాజీపడ్డారని... సూరిని భానుతో చంపించింది పరిటాల సునీతే అని ఆరోపించారు. పరిటాల రవి అనుచరుడు జగ్గుతో తమ తల్లిని తిట్టించారని... తమ తల్లిని తిడితే కొడుకులుగా తమకు బాధ ఉండదా? అని ప్రశ్నించారు.

ప్రాణాలకు హాని కలుగుతుందేమోననే బాధతోనే తన అన్న అలా మాట్లాడి ఉండొచ్చని చెప్పారు. ఆయన వాడిన భాషపై పార్టీ పెద్దలు మందలించారని, తాము క్షమాపణ కూడా చెప్పామని అన్నారు. తమ తల్లిని తిట్టినందుకు ఒక టీడీపీ నేత కూడా క్షమాపణ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News