Telangana: ట్విట్టర్లో రేవంత్ రెడ్డి వర్సెస్ కల్వకుంట్ల కవిత

  • దీక్ష దివాస్ గురించి ట్వీట్ చేసిన కవిత
  • ఇది దీక్ష దివాస్ కాదు దొంగ దివాస్ అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా
  • అప్పటి నుంచి వరుస ట్వీట్లతో విమర్శలు చేసుకుంటున్న రేవంత్, కవిత
Kalvakuntla Kavitha vs revanth reddy in twitter

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం నడుస్తోంది. ‘దీక్షా దివాస్’ విషయంలో ఇద్దరి మధ్య ఈ వార్ మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన నవంబర్ 29వ తేదీని ‘దీక్షా దివాస్’ నిర్వహిస్తున్న సందర్భంగా కవిత ట్వీట్ చేశారు.

‘కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, ‌సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు... నవంబర్ 29, దీక్షా దివాస్. ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది’ అని కవిత ట్వీట్ చేశారు. 

అయితే, ఇది దీక్ష దివాస్ కాదు.. దగా దివాస్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేయడంతో కవిత తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు’ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే… బతుకమ్మ ఆడినందుకే… బోనం కుండలు ఎత్తినందుకే … మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే… తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!?’ అని ప్రశ్నించారు. ‘అమరవీరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? అందుకే… త్యాగాలు చేసిందెవరు, భోగాలు అనుభవిస్తోందెవరని యావత్ తెలంగాణ ఘోషిస్తోంది’ అని ట్వీట్ చేశారు. 

అయితే, మహిళలు, బతుకమ్మ, బోనాలను రేవంత్ రెడ్డి కించపరిచారంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల నోట బతుకమ్మ పేరు ఉచ్చరించేలా చేసి వారి చేత బతుకమ్మ ఎత్తించేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతే అవుతుందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. ‘చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై " తుపాకీ " ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం, బతుకమ్మకే పరిమితం చేస్తూ మాట్లాడడం అనేది మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది’ అని కవిత ట్వీట్ చేశారు. దీనికి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

More Telugu News