Chandrababu: రేపు 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?' కార్యక్రమం ప్రారంభించనున్న చంద్రబాబు

  • మూడు జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు
  • నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు పర్యటన
  • రేపు ఏలూరు జిల్లాలో 'ఇదేం ఖర్మ' కార్యక్రమం ప్రారంభం
  • డిసెంబరు 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా షురూ
Chandrababu will launch Idem Kharama Mana Rashtraniki program tomorrow in Eluru district

రాష్ట్రంలో రివర్స్ పాలన జరుగుతోందని విమర్శిస్తున్న టీడీపీ 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?' పేరిట భారీ కార్యక్రమం తలపెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు. 

వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో చర్చించడం, ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలతో ఈ కార్యక్రమం సాగనుంది. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అంతా దీనిలో భాగస్వాములు అవుతారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు మూడు జిల్లాలలో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. రేపటి నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో చంద్రబాబు పర్యటిస్తారు. 

పర్యటన మొదటి రోజు దెందులూరు, చింతలపూడి... రెండో రోజు పోలవరం, కొవ్వూరు... మూడో రోజు నిడదవోలు, తాడేపల్లి గూడెం నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. రేపు దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో చంద్రబాబు 'ఇదేం ఖర్మ' కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. డిశంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఇంచార్జ్ లు, నాయకులు ఈ కార్యక్రమాన్ని తమ నియోజకవర్గాల్లో మొదలు పెడతారు.

More Telugu News