Rat: ఎలుకను డ్రైనేజిలో ముంచి చంపిన వ్యక్తిపై కేసు నమోదు

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • బదౌన్ పట్టణంలో ఓ వ్యక్తి క్రూరత్వం 
  • ఎలుక తోకను ఇటుక రాయికి కట్టిన వైనం
  • డ్రైనేజిలో ఇటుకను వదిలేయడంతో మరణించిన ఎలుక 
Case filed against a man after he killed a rat by drowning it in drainage

ఉత్తరప్రదేశ్ లో ఎలుక పట్ల క్రూరంగా వ్యవహరించినందుకు ఓ వ్యక్తిపై పోలీసు కేసు నమోదైంది. బదౌన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. 

మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఎలుకను ఓ ఇటుక రాయికి కట్టేసి దాన్ని డ్రైనేజిలో జారవిడిచాడు. తోకను ఇటుకరాయికి కట్టడంతో ఆ ఎలుక తప్పించుకోలేక గిలగిల్లాడింది. ఈ దృశ్యాలను జంతు హక్కుల ఉద్యమకారుడు వికేంద్ర శర్మ వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

కాగా మనోజ్ కుమార్ ఎలుకను డ్రైనేజిలో ముంచుతుండడాన్ని వీడియో తీసిన వికేంద్ర శర్మ... ఆ ఎలుకను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. ఆ మురికి కాలువ నుంచి ఆయన దాన్ని బయటికి తీసినా, కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. 

కాగా, క్రూరమైన రీతిలో ఎలుక ప్రాణాలు తీసిన మనోజ్ కుమార్ పై పోలీసులు సెక్షన్ 429, సెక్షన్ 11 (1) (1)ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు మనోజ్ కుమార్ ను స్టేషన్ కు పిలిపించి విచారించారు. చనిపోయిన ఎలుకను ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం బదౌన్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News