BJP: బండి సంజయ్ యాత్రకు హైకోర్టు అనుమతి

  • భైంసా సిటీలోకి యాత్ర ప్రవేశించకూడదని షరతు 
  • సిటీకి 3 కి.మీ. దూరంలో సభ ఏర్పాటు చేసుకోవాలని సూచన
  • అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు కోర్టు ఆదేశం
Telangana High Court Green Signal To Bandi Sanjay Padayatra in Bhainsa

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. బహిరంగ సభకు మాత్రం షరతులు విధించింది. భైంసా సిటీలోకి యాత్ర ప్రవేశించకూడదని, సిటీకి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభ పెట్టుకోవాలని షరతులు విధించింది. లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు హైకోర్టు బెంచ్ సూచించింది.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ విడత యాత్రను సోమవారం నుంచి ప్రారంభించాలని బండి సంజయ్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత యాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు.. చివరి నిమిషంలో అనుమతి రద్దు చేసి సంజయ్ ను అడ్డుకున్నారు. దీనిపై ఆదివారం రాత్రి హైడ్రామా నెలకొంది. నిర్మల్ వెళుతున్న సంజయ్ ను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించాయి.

యాత్రకు అనుమతి విషయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ బండి సంజయ్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. బండి యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, భైంసా సిటీలోకి పాదయాత్ర ఎంటర్ కాకూడదని, సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో సభను ఏర్పాటు చేసుకోవాలని షరతులు విధించింది.

More Telugu News