Chandrababu: చంద్రబాబుతో తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ల సమావేశం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అధినేత

  • పార్టీ ఆఫీసులో చంద్రబాబు వరుస సమావేశాలు
  • చంద్రబాబును కలిసి పరిస్థితి వివరించిన కౌన్సిలర్లు
  • తాడిపత్రి పరిస్థితులను అడిగి తెలుసుకున్న చంద్రబాబు
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా
Tadipatri municipal councilors met TDP Chief Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. ఈ సందర్భంగా తాడిపత్రి టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రబాబును కలిశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన రోజు నుంచి తమను ప్రభుత్వం ఎలా వేధిస్తోందో కౌన్సిలర్లు చంద్రబాబుకు వివరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 58 అక్రమ కేసులు పెట్టారని వారు వివరించారు. 

అనంతరం చంద్రబాబు స్పందిస్తూ, ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో తాడిపత్రిలో జరిగే ఘటనలు చూస్తే అర్థం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పోటీకి దిగిన వారిని వేధించారు... నామినేషన్లు కూడా వెయ్యకుండా అడ్డుకున్నారు అని మండిపడ్డారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కౌన్సిలర్లను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసు కేసులు నిత్యకృత్యం అయ్యాయని తెలిపారు. 

అయినా ఇంతటి పట్టుదల, సంకల్పంతో పోరాడుతున్న టీడీపీ కౌన్సిలర్లకు అభినందనలు అంటూ తాడిపత్రి నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. "నియోజకవర్గ ఇంచార్జ్  అస్మిత్ రెడ్డిపైనా దాడి చేశారు. ఇలా చేస్తే భయపడిపోతారు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. పార్టీ నేతల్లో భయం పోయి... తెగువ వచ్చింది. 

ఈ కేసులు, దాడులకు మామూలు వ్యక్తులు అయితే భయపడిపోయేవారు. కౌన్సిలర్లకు అండగా నిలిచిపోరాడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అభినందనలు. పోరాటం చేస్తున్న కౌన్సిలర్లకు హ్యాట్సాఫ్ చెపుతున్నా. 

నా జీవితంలో చూడని ప్రజా స్పందన కర్నూలులో చూశాను. దీనికి కారణం ఏంటి అనేది నేను కూడా విశ్లేషించాను. తమ భవిష్యత్ కోసం ప్రజలు తరలివచ్చి నాకు మద్దతు తెలిపారు. నేను కర్నూలుకు వెళితే వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. మరో రెండు మూడు జిల్లాలు తిరిగితే వైసీపీ పని పూర్తిగా అయిపోతుంది. సీఎం పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది.

తాడిపత్రిలో చేసిన తప్పులకు స్థానిక డీఎస్పీ సహా అధికారులు అంతా మూల్యం చెల్లిస్తారు. ప్రజలను బాధపెట్టిన డీఎస్పీ రేపు అంతే బాధపడే పరిస్థితి వస్తుంది. తాడిపత్రిలో అరాచకాలు చేసిన వారి సంగతి నాకు వదిలెయ్యండి... నేను చూసుకుంటాను. 

ఇంట్లో ఉన్న మహిళలపై సైతం అట్రాసిటీ కేసులు పెట్టారు. తాడిపత్రిలో ఆడబిడ్డల పోరాటానికి అభినందనలు. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటిపైకి ఎమ్మెల్యే వెళ్లి దాడిచేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు. తప్పు చేసిన అధికారులను వారు చేసిన తప్పులు వెంటాడుతాయి. అలాంటి అధికారులందరికీ గుణపాఠం చెపుతాను" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పోరాడుతున్న వారికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

More Telugu News