Team New Zealand: న్యూజిలాండ్‌తో వన్డే: అర్ధ సెంచరీలు చేసి.. ఒకే స్కోరు వద్ద అవుటైన గిల్, ధావన్

  • కివీస్‌తో ఆక్లాండ్‌లో తొలి వన్డే
  • టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
  • అర్ధ సెంచరీలతో రాణించిన ధావన్, గిల్
India lost Two wickets at Same Score

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు గిల్, ధావన్ వికెట్లను చేజార్చుకుంది. 65 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ ఆ వెంటనే ఫెర్గూసన్ బౌలింగులో కాన్వేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 124 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత అదే స్కోరు వద్ద ధావన్ కూడా పెవిలియన్ చేరాడు. అంతకుముందు ధావన్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ధవన్, గిల్ చక్కని భాగస్వామ్యం అందించారు. తొలుత క్రీజులో కుదురుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చిన వీరిద్దరూ ఆ తర్వాత బ్యాట్లకు పని చెప్పారు. అడపాదడపా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ క్రమంలో మిల్నే బౌలింగులో ఫోర్ కొట్టిన ధావన్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 39వ అర్ధ సెంచరీ. 

ఆ తర్వాత కాసేపటికే గిల్ కూడా వన్డేల్లో తన నాలుగో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో భారత్‌కు రెండు వరుస దెబ్బలు తగిలాయి. 124 పరుగుల వద్ద గిల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన భారత్.. అదే స్కోరు వద్ద సౌథీ బౌలింగులో ధావన్ కూడా పెవిలియన్ చేరాడు. మొత్తంగా 77 బంతులు ఎదుర్కొన్న ధావన్ 13 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిశాయి. భారత్ రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు.

More Telugu News