Uttarakhand: ఉత్తరాఖండ్ లో 100 మందికి పైగా డాక్టర్ల 'అదృశ్యం'

  • విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ వైద్య శాఖ
  • ఆచూకీ చెప్పని 109 మంది డాక్టర్లు
  • వారు ఎక్కడ ఉంటున్నారో తెలియని వైనం
  • చాన్నాళ్లుగా విధులకు గైర్హాజరు
  • త్వరలోనే సర్వీసు నుంచి తొలగించనున్న ప్రభుత్వం
100 more doctors in missing list In Uttarakhand

ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్న 109 మంది ఇప్పుడెక్కడున్నారో తెలియక తల పట్టుకుంటోంది. గత కొన్నేళ్లుగా విధులకు హాజరుకాని ఆ డాక్టర్ల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

వైద్య శాఖ రికార్డుల్లో ఆ డాక్టర్ల పేర్లు ఉన్నప్పటికీ, వారు ఆసుపత్రుల్లో మాత్రం కనిపించడంలేదు. తాము ఎక్కడ ఉంటున్నది ఆ వైద్యులు చాన్నాళ్లుగా అధికార వర్గాలకు సమాచారం అందించడంలేదు. దాంతో వారిని బ్లాక్ లిస్టులో చేర్చి, విధుల నుంచి తొలగించాలని ఉత్తరాఖండ్ వైద్య శాఖ నిర్ణయించింది. 

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఆ 109 మంది డాక్టర్లు మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా రావడం సాధ్యంకాదు. ఇప్పటికే ఆ డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, త్వరలోనే వారిని సర్వీసు నుంచి తప్పిస్తామని ఉత్తరాఖండ్ వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్) ఏఎం జోహ్రీ వెల్లడించారు. 

కాగా, ఆచూకీ లేకుండా పోయిన డాక్టర్లలో కొందరు ప్రభుత్వ స్కీం ద్వారా వైద్య విద్యను అభ్యసించి, ఉద్యోగాల్లో చేరినవారని తెలుస్తోంది. వైద్యవిద్య పూర్తయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2-3 ఏళ్లు తప్పనిసరిగా పనిచేస్తామని బాండ్ రాసిస్తే, వారికి వైద్య విద్యకయ్యే ఖర్చులో ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తుంది. అయితే ఇలాంటి రాయితీలు ఉపయోగించుకుని వైద్య విద్య పూర్తి చేసుకున్నవారు కూడా పత్తా లేకుండా పోవడంతో ఉత్తరాఖండ్ వైద్య శాఖ తీవ్ర అసంతృప్తితో ఉంది.

More Telugu News