Ch Malla Reddy: క్వార్టర్స్ లో దాచిన మల్లారెడ్డి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు

  • మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు
  • తనిఖీల్లో పాల్గొన్న 50 బృందాలు
  • క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ ను కూడా ప్రశ్నిస్తున్న అధికారులు
IT officials found Malla Reddy phone in quarters

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 50 బృందాలు తనిఖీలను నిర్వహిస్తున్నాయి. కాగా, మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు ఎట్టకేలకు ఆయన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి సెల్ ఫోన్ ఆయన నివాసం పక్కన ఉన్న క్వార్టర్స్ వద్ద ఓ గోనెసంచిలో దాచి ఉంచడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. 

మల్లారెడ్డికి వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక యూనివర్శిటీ, 38 ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల నగదు లావాదేవీలు బాలానగర్ లో ఉన్న క్రాంతి బ్యాంక్ లో జరిగినట్టుగా ఐటీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావును కూడా ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

More Telugu News