aap: కేజ్రీవాల్ రోడ్ షో లో ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు

  • ఆదివారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఘటన
  • అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆప్ కార్యకర్తలు
  • వాళ్లకు నచ్చిన వాళ్లకు జైకొట్టనివ్వాలని ఆప్ చీఫ్ సూచన
  • భవిష్యత్తులో ఒకరోజు మీ మనసులు గెల్చుకుంటాం.. మిమ్మల్ని పార్టీలో చేర్చుకుంటామని ధీమా
modi modi chants in arvind kejriwal gujart road show

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు వింత అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని పంచ్మహల్ జిల్లాలోని హలోల్ లో ఆదివారం కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకచోట ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. ఓవైపు ఆయన మాట్లాడుతుంటే కొంతమంది జనం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కేజ్రీవాల్ వారిని నిలువరించి, వారికి ఇష్టమైన నేతలకు జైకొట్టనివ్వాలని సూచించారు. 

నినాదాలు చేసేవారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇక్కడ కొంతమంది మిత్రులు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కానీ వారి పిల్లలకు స్కూళ్లు నిర్మించి ఇచ్చేది మాత్రం ఈ కేజ్రీవాలే. మీరు ఎవరికి జైకొట్టినా మీకు ఉచిత విద్యుత్తు ఇచ్చేది ఈ కేజ్రీవాలే’ అని చెప్పారు. మీకు నచ్చిన నేతకు జైకొట్టండి.. మాకు ఎవరిపైనా శత్రుత్వం లేదు. ఏదో ఒకరోజు మీ మనసులను మేం గెల్చుకుంటాం. ఇప్పుడు మోదీ మోదీ అన్నట్లుగానే భవిష్యత్తులో ఒకరోజు కేజ్రీవాల్, కేజ్రీవాల్ అనిపించుకుంటామని ఆప్ చీఫ్ పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు ప్రజల దగ్గరికి వస్తున్నాయన్న కేజ్రీవాల్.. అందులో ఏ పార్టీ కూడా స్కూళ్లు, ఆసుపత్రులు కట్టిస్తానని చెప్పట్లేదని విమర్శించారు. ఉచిత విద్యుత్తు ఇస్తామని కానీ ఉద్యోగాల కల్పన గురించి కానీ నిరుద్యోగ భృతి గురించి కానీ ఏ పార్టీ నేత కూడా మాట్లాడడని వివరించారు. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే వీటి గురించి మాట్లాడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

గుజరాత్ ప్రజలకు తను చేసే విజ్ఞప్తి ఒక్కటేనని చెబుతూ.. ‘27 ఏళ్ల పాటు వేరేవాళ్లకు అవకాశమిచ్చారు, మాకు ఒక్క ఐదేళ్లు అవకాశమిచ్చి చూడండి. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే మరోసారి గుజరాత్ వైపు కూడా చూడను’ అని కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను అభ్యర్థించారు.

More Telugu News