Rahul Gandhi: ఆటకు సిద్ధమవుతాడు.. మైదానంలోకి మాత్రం రాడు: రాహుల్ పై అసోం సీఎం

  • క్రికెట్ మ్యాచ్ గువాహటిలో ఉంటే రాహుల్ గుజరాత్ లో అంటూ అసోం సీఎం వ్యాఖ్య
  • చారిత్రక విషయ పరిజ్ఞానం తక్కువని విమర్శ
  • గుజరాత్ లో బీజేపీదే అధికారమన్న ధీమా  
Keeps getting ready but wont come to field Assam CMs potshot at Rahul Gandhi

భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

‘‘రాహుల్ గాంధీకి ఒక అలవాటు ఉంది. దీన్ని నేను ఎన్నో రోజులుగా గమనించాను. గువాహటిలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆయన గుజరాత్ లో ఉంటారు. ఆయన తన వెంట బ్యాట్, ప్యాడ్ ను కూడా సిద్ధంగా పెట్టుకుంటారు. కానీ, మైదానానికి రారు’’ అంటూ వ్యాఖ్యానించారు. మరో రెండు వారాల్లో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయినా రాహుల్ గాంధీ ఇంత వరకు గుజరాత్ ఎన్నికల ప్రచారంలోకి రాలేదు. దీంతో బిశ్వ శర్మ పరోక్ష విమర్శలు చేశారు.

గుజరాత్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని బిశ్వ శర్మ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండు, మూడో స్థానాల్లో నిలుస్తాయని జోస్యం చెప్పారు. ‘‘బీజేపీ ఉన్న స్థానంలోనే ఉంటుంది. బీజేపీకి పోటీ లేదు. రెండు, మూడో స్థానం కోసమే ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది’’ అని వ్యాఖ్యానించారు. వీర్ సావర్కార్ విషయంలో రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చారిత్రక విషయ పరిజ్ఞానం తక్కువన్నారు.

More Telugu News