Tollywood: అక్కడ పుష్ప2 కోసం ఆగేదేలే అంటున్న ఫ్యాన్స్.. పుష్ప1నే రీరిలీజ్ చేస్తున్న చిత్ర బృందం

  • కేరళలో బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్
  • గతేడాది డిసెంబర్17న విడుదలైన పుష్ప1కు బ్రహ్మరథం పట్టిన అభిమానులు 
  • వచ్చేనెల 17న కేరళలో పుష్ప1 రీరిలీజ్ కు ఏర్పాట్లు
pushpa part1 re release in kerala

అల్లు కుటుంబం నుంచి వచ్చి, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. కొత్త రకం పాత్రలు, ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడని అర్జున్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగిపోయాడు. హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్న బన్నీ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ‘పుష్ప’తో అతని స్టార్ డమ్ అమాంతం పెరిగింది. మొన్నటిదాకా దక్షిణాదిలో పేరున్న అల్లు అర్జున్ కు హిందీలోనూ భారీ మార్కెట్ ఏర్పడింది. ‘పుష్ప’తో తను ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఘన విజయంతోపాటు భారీ వసూళ్లు సొంతం చేసుకున్న ‘పుష్ప’ మలయాళ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. బన్నీకి ఇప్పటికే కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ తనను మల్లు అర్జున్ గా పిలుచుకుంటారు.

‘పుష్ప’ రెండో పార్టు ‘ది రూల్’ కోసం అన్ని భాషల అభిమానుల మాదిరిగానే కేరళలో బన్నీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. అయితే, ‘పుష్ప’2 ఇప్పట్లో వచ్చేలా లేదు. మరోవైపు ‘పుష్ప’ తొలి భాగం వచ్చి ఏడాది అవుతోంది. గతేడాది డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రెండో భాగం కోసం వేచి ఉండలేకపోతున్న కేరళ ఫ్యాన్స్ ‘పుష్ప’ తొలి భాగాన్ని మరోసారి థియేటర్లలో చూడాలని నిర్ణయించుకున్నారు. 

ఈ నేపథ్యంలో తొలిభాగం విడుదలైన డిసెంబర్ 17న రీరిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. ఇ4 ఎంటర్‌ ‌టైన్మెంట్ సంస్థ కేరళ వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ‘పుష్ప’ను రీ రిలీజ్ చేయబోతోంది. ఈ మధ్య హీరోల పుట్టిన రోజులకు వాళ్ల పాత చిత్రాలు, బ్లాక్ బస్టర్స్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ బన్నీ ఫ్యాన్స్ బర్త్ డేతో సంబంధం లేకుండా.. రీసెంట్ బ్లాక్ బస్టర్‌‌‌‌నే మళ్లీ విడుదల చేయాలనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Telugu News