ISRO: నేడు నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. చారిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం

  • ‘విక్రమ్-ఎస్’ను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ  స్కైరూట్ ఏరోస్పేస్
  • ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం
  • వీక్షించనున్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
  • 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోనున్న రాకెట్
 ISRO to launch countrys first privately built rocket today

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్‌ను నేడు నింగిలోకి పంపనుంది. హైదరాబాద్‌‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ సబార్టియల్ (వీకేఎస్). ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటమిక్ ఎనర్జీ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరి కోటకు వస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి పంపడం ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం ఉనికిని పెంచేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. 

ఈ సింగిల్ స్టేజ్ స్పిన్ స్టెబిలైజ్‌డ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ బరువు దాదాపు 545 కేజీలు. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం అది సముద్రంలో కూలిపోతుంది. ఈ మొత్తం ప్రయోగం 300 సెకన్లలో ముగుస్తుంది. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ మాట్లాడుతూ.. విక్రం సిరీస్ ఆర్బిటల్ క్లాస్ స్పేస్‌లాంచ్ వెహికల్స్‌లోని మెజారిటీ సాంకేతికతలను పరీక్షించేందుకు విక్రమ్-ఎస్ సాయపడుతుందని పేర్కొంది.

More Telugu News