Andhra Pradesh: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్... నిధులు విడుదల చేసిన కేంద్రం

  • విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డులో జోన్ భవనాలకు రూ.106 కోట్ల కేటాయింపు
  • పాత వైర్ లెస్ కాలనీలో జోన్ కోసం 13 ఎకరాల భూసేకరణ
  • అందులో 8 ఎకరాల్లో జోన్ భవనాలను మల్టీ స్టోరీ బిల్డింగుల రూపంలో నిర్మాణం
  • విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు రూ.456 కోట్ల కేటాయింపు
union government issues green signal to south coast railway zone in vizag

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలోని విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటనకు అనుగుణంగా సోమవారం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జోన్ ఏర్పాటుకు కేంద్రం తొలి అడుగు వేసింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ జోన్ కు అవసరమైన నిధులను కేటాయిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా ప్రకటనలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డులో రూ.106 కోట్ల నిధులతో కొత్త రైల్వే జోన్ కు చెందిన భవనాలను నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి దశలో భాగంగా పాత వైర్ లెస్ కాలనీలో 13 ఎకరాలను నూతన రైల్వే జోన్ కోసం కేంద్రం సేకరించింది. ఇందులో 8 ఎకరాల్లో నూతన రైల్వే జోన్ కు సంబంధించి మల్టీ స్టోరీ భవనాలను నిర్మించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు రూ.456 కోట్లను మంజూరు చేసింది. రైల్వే స్టేషన్ లో అదనంగా మరో 2 ఫ్టాట్ ఫారాలను నిర్మించనుంది.

More Telugu News