Murder: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని చంపేశాడు... ముక్కలు చేసి ఢిల్లీ వీధుల్లో విసిరేశాడు!

  • ముంబయికి చెందిన శ్రద్ధ, ఆఫ్తాబ్ ప్రేమికులు
  • పెద్దలు అంగీకరించకపోవడంతో ఢిల్లీ వచ్చిన వైనం
  • దేశ రాజధానిలో సహజీవనం
  • ఇరువురి మధ్య తరచుగా ఘర్షణలు
Man murders his partner and thrown away body parts in Delhi streets

ఇటీవల కాలంలో సహజీవనం సంస్కృతి భారత్ లోనూ పెరిగిపోయింది. కొన్నిసార్లు ఈ సహజీవన బంధాలు వికటిస్తున్నాయి. హత్యల వరకు దారితీస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే జరిగింది. 

ముంబయికి చెందిన శ్రద్ధ, ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ప్రేమికులు. శ్రద్ధ ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తోంది. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఢిల్లీ వచ్చి సహజీవనం చేస్తున్నారు. అయితే, శ్రద్ధ పెళ్లి చేసుకోవాలని ఆఫ్తాబ్ పై ఒత్తిడి తెచ్చేది. 

పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఓ రోజు ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఆఫ్తాబ్... శ్రద్ధను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆనవాలు లేకుండా చేయాలని భావించి 35 ముక్కలుగా చేశాడు. వాటిని ఫ్రిజ్ లో పెట్టి, ప్రతి రోజూ అర్ధరాత్రి వేళ కొన్ని ముక్కలను తీసుకుని ఢిల్లీ వీధుల్లో పారేసి వచ్చేవాడు. ఈ విధంగా 18 రోజుల పాటు చేశాడు. 

కాగా, శరీర భాగాలను భద్రపరిచేందుకు 300లీ ఫ్రిజ్ కూడా కొనుగోలు చేశాడు. తాముంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన రాకుండా ప్రతిరోజూ అగర్ బత్తీలు వెలిగించేవాడు.

అయితే, శ్రద్ధ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఆఫ్తాబ్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధకు ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆమె తండ్రి ఢిల్లీ వచ్చారు. ఫ్లాట్ కు తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆఫ్తాబ్ ను అరెస్ట్ చేయడంతో, హత్య, ఆ హత్యను రూపుమాపేందుకు మృతదేహం భాగాలను ఢిల్లీ వీధుల్లో విసిరివేయడం మొత్తం వెల్లడైంది. అమెరికన్ టీవీ క్రైమ్ షో 'డెక్స్ టర్' స్ఫూర్తిగా అతడు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News