Congress: నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తాం: గుజరాత్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక హామీలు

  • గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
  • 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ
  • రూ. 3 లక్షల వరకు రైతు రుణమాఫీ
Gujarat Congress Manifesto

అహ్మదాబాద్ లోని క్రికెట్ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరును తీసేసి సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ గెలిస్తే తొలి కేబినెట్ మీటింగ్ లోనే ఈ మేనిఫెస్టోను అధికారిక డాక్యుమెంట్ గా మారుస్తామని చెప్పారు.

రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, ఒంటరి మహిళ, వితంతువు, వృద్ధ మహిళలకు నెలకు రూ. 2 వేల పెన్షన్, 3 వేల ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అమ్మాయిలకు ఉచిత విద్యుత్, రూ. 3 లక్షల వరకు రైతు రుణాల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల భృతి, రూ. 500కే గ్యాస్ సిలిండర్ తదితర హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. డిసెంబర్ 1న, 5న గుజరాత్ లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ జరుగుతుంది.

More Telugu News