Sunil Gavaskar: సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించొచ్చు.. పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం: గవాస్కర్

  • సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా దారుణ పరాజయం
  • జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
  • సీనియర్ ఆటగాళ్లు వీడ్కోలు గురించి ఆలోచిస్తుండొచ్చన్న గవాస్కర్
Sunil Gavaskar Says Some Senior Players thinking about Retirment

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు మామూలే అయినా ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీసీఐ మొదలుకొని కోచ్‌లు, ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. 

ఈ ఓటమితో జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో కొందరు కెరియర్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే, రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా తొలిసారే ట్రోఫీని అందించాడని, కాబట్టి భవిష్యత్తులో టీమిండియా బాధ్యతలు అతడికి అప్పగించే అవకాశం ఉందని అన్నాడు. టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోవచ్చని, దీని గురించి వారు తప్పకుండా ఆలోచిస్తారని అన్నాడు.

More Telugu News