CJI: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్... రేపు ప్రమాణస్వీకారం

  • 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్
  • రేపు రాష్ట్రపతి భవన్ లో సీజేఐగా ప్రమాణం చేయనున్న వైనం
  • అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి కేసుల్లో తీర్పులిచ్చిన న్యాయమూర్తి
  • రెండేళ్ల పాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ చంద్రచూడ్
Justice DY Chandrachud will takes as cji tomorrow

భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ రేపు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి భవన్ లో రేపు ఉదయం 10 గంటలకు జస్టిస్ చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ లలిత్., తన వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్ ను సిఫారసు చేయగా... సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని ఇదివరకే కేంద్రం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ చంద్రచూడ్... సీజేఐగా ఏకంగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. 1998లో అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్.. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అలహాబాద్, బాంబే హైకోర్టుల సీజేగా ఆయన పనిచేశారు. దేశంలోనే కీలక కేసులుగా పరిగణించిన అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి కేసుల్లో జస్టిస్ చంద్రచూడ్ కీలక తీర్పులు ఇచ్చారు.

More Telugu News