BJP: ఎల్కే అద్వానీకి ఇంటికెళ్లి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

  • 1927లో జన్మించిన అద్వానీ
  • రాజ్ నాథ్ తో కలిసి అద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ
  • బీజేపీ కురు వృద్ధుడితో చర్చలు జరిపిన మోదీ
pm modi birth day greetings to bjp veteran leader LK Advani

బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ జన్మదినం నేడు. 95 ఏళ్ల వయసులోనూ ఆయన ఇంకా చురుగ్గానే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి అద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ... బీజేపీ కురు వృద్ధుడికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అద్వానీతో కూర్చుని పలు అంశాలపై మోదీ చర్చించారు. 

1927 నవంబర్ 8న ఇప్పటి పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించిన అద్వానీ... దేశ విభజన సమయంలో కుటుంబంతో కలిసి భారత్ వచ్చేశారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో ప్రచారక్ గా చేరిన ఆయన ఆ సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. తదనంతరం జన సంఘ్ లో చేరిన అద్వానీ... జన సంఘ్ ను బీజేపీగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. 

1990 దశకంలో దేశ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేని బీజేపీని... దేశవ్యాప్త రథయాత్రతో ఏకంగా కేంద్రంలో అధికారం చేపట్టే దిశగా ఆయన తీర్చిదిద్దారు. ఆ తర్వాత వాజ్ పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా... అద్వానీ ఉప ప్రధాని పదవిని నిర్వహించారు. వాజ్ పేయి ఉన్నంత కాలం క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్న అద్వానీ... కొత్త తరం పార్టీ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా జరిగారు.

More Telugu News