YS Rajasekhar Reddy: రాజశేఖరరెడ్డి, చంద్రబాబు రోజుకు రెండు, మూడు సార్లయినా మాట్లాడుకునేవారు: కేవీపీ

  • ఐ డ్రీమ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కేవీపీ
  • వైఎస్సార్, చంద్రబాబు మంచి మిత్రులని వెల్లడి 
  • చంద్రబాబు టీడీపీలో చేరేదాకా వారి స్నేహం కొనసాగిందన్న మాజీ ఎంపీ
  • చంద్రబాబు ధైర్యం, తెలివిలో ఎక్స్ ట్రార్డినరీ కాదని వ్యాఖ్య
kvp ramachandra rao comments on ysr and chandrababu friendship

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుల మధ్య స్నేహం గురించి వైఎస్సార్ ఆత్మగా పేరు పడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐడ్రీమ్ మీడియా ప్రతినిధి నాగరాజుకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్సార్, చంద్రబాబుల స్నేహాన్ని కేవీపీ ప్రస్తావించారు. వైఎస్సార్, చంద్రబాబులు మంచి మిత్రులని చెప్పిన కేవీవీ.. వారిద్దరూ రోజుకు కనీసం రెండు, మూడు సార్లయినా మాట్లాడుకునే వారని, లేదంటే కలిసే వారని కేవీపీ అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరే దాకా వైఎస్సార్, చంద్రబాబుల మధ్య స్నేహం కొనసాగిందని ఆయన చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు టీడీపీలో చేరిపోయారో... అప్పటి నుంచి వారి స్నేహం నిలిచిపోయిందని కూడా కేవీపీ చెప్పారు.

ఆహా ఓటీటీలో బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ స్టాపబుల్ షోకు ఇటీవలే చంద్రబాబు గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీకు మంచి స్నేహితుడు ఎవరన్న బాలయ్య ప్రశ్నకు స్పందించిన చంద్రబాబు...రాజశేఖరరెడ్డితో కలిసి బాగా తిరిగేవాడినంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నాగరాజు ప్రస్తావించగా...ఏమాత్రం అరమరికలు లేకుండా కేవీపీ బదులిచ్చారు. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు మంచి మిత్రులేనని కేవీపీ చెప్పారు. చంద్రబాబు, రాజశేఖరరెడ్డి వయసులో సమకాలీకులని చెప్పిన కేవీపీ...ఇద్దరూ ఒకేసారి మంత్రులు అయ్యారని గుర్తు చేసుకున్నారు. తనకు కూడా చంద్రబాబుతో మంచి స్నేహమే ఉండేదని, అయితే చంద్రబాబు టీడీపీలో చేరిన తర్వాత ఆయనతో స్నేహాన్ని కొనసాగించలేదని చెప్పారు.

ఇక విధానాల పరంగా రాజశేఖరరెడ్డి, చంద్రబాబుల మధ్య వ్యత్యాసాలను ప్రస్తావించిన సందర్భంగా చంద్రబాబుపై కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ధైర్యవంతుడు కాదని తాను చెప్పడం లేదన్న కేవీవీ... అంత ఎక్కువ ధైర్యం ఉన్న నేత మాత్రం చంద్రబాబు కాదని చెప్పారు. అంతేకాకుండా తెలివితేటల్లోనూ చంద్రబాబు ఎక్స్ ట్రార్డినరీ కూడా కాదని చెప్పారు. ఏ పని చేయాలన్నా... ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మరీ చంద్రబాబు ముందుకు వెళ్లేవారన్నారు. ఇక దేశీయ విధానాల కంటే కూడా విదేశీ విధానాల ప్రభావం చంద్రబాబుపై అధికంగా ఉండేదని కేవీపీ చెప్పారు. అందుకే అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్ క్లింటన్ రాష్ట్రానికి వస్తే... చంద్రబాబు ఆయనను ఐటీ పరిశ్రమల వద్దకు తీసుకెళ్లారన్నారు. అదే అమెరికా అధ్యక్షుడి హోదాలో జార్జి బుష్ రాష్ట్రానికి వస్తే... రాజశేఖరరెడ్డి ఆయనను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారని కేవీపీ చెప్పుకొచ్చారు.

More Telugu News