Telangana: సీఎం కేసీఆర్​ పెట్టిన మునుగోడు ‘మెజారిటీ’ పరీక్షలో మంత్రుల ప్రోగ్రెస్​ రిపోర్టు

  • మండలాలు, గ్రామాలకు ఇంచార్జీలుగా వ్యవహరించిన మంత్రులు
  • కేటీఆర్‌, హరీశ్ రావు, సబిత, గంగుల, ఎర్రబెల్లి ఇంచార్జీ లుగా ఉన్న చోట టీఆర్ఎస్ కు మెజారిటీ
  • జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న చోట బీజేపీకి ఆధిక్యం
cabinet ministers progress report for munugode bypoll

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించి అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. పది వేల ఓట్ల మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ముందు నుంచీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 

ఇక ఎన్నిక షెడ్యూల్ వెలువడిన దగ్గర నుంచి మంత్రులు, మెజారిటీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించింది. ప్రతి మంత్రికి మండలం, గ్రామాల వారీగా ప్రచార బాధ్యతలను సీఎం కేసీఆర్ కేటాయించారు. తమకు కేటాయించిన గ్రామాల్లో పార్టీకి మెజారిటీ ఓట్లు తీసుకొచ్చే పరీక్ష పెట్టారు. ఈ పరీక్షలో కొందరు మంత్రులు పాస్ అవ్వగా.. మరికొందరికి మునుగోడు ఓటర్లు షాకిచ్చారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఇంచార్జీగా వ్యవహరించిన లెంకలపల్లిలో టీఆర్‌ఎస్ కు 254 ఓట్ల ఆధిక్యం వచ్చింది. హరీశ్‌రావు (మర్రిగూడ–613 ఓట్లు), నిరంజన్‌రెడ్డి (దామెరభీమనపల్లి–613 ఓట్లు), కేటీఆర్ (గట్టుప్పల్‌ ఎంపీటీసీ 1, 2 పరిధి–65 ఓట్లు), సత్యవతి రాథోడ్‌ (పొర్లగడ్డ తండా–288 ఓట్లు), సబిత (పసులూరు గ్రామం–332 ఓట్లు), గంగుల (సంస్థాన్‌ నారాయణపురం–66 ఓట్లు), ఎర్రబెల్లి (చండూరు 2, 3 వార్డుల పరిధి–488 ఓట్లు) ఇంచార్జీ లుగా ఉన్న చోట్ల టీఆర్ఎస్ కి ఆధిక్యం వచ్చింది.

ఇక మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను మొత్తాన్ని పర్యవేక్షించిన జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంచార్జీ గా ఉన్న మునుగోడు పట్టణంలోని వార్డులో బీజేపీకి 193 ఓట్ల ఆధిక్యం దక్కడం విశేషం. శ్రీనివాస్ గౌడ్‌తో పాటు, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి ఇన్‌చార్జులుగా వ్యవహరించిన గ్రామాల్లోనూ బీజేపీ మెజారిటీ సాధించింది.

More Telugu News