T20 World Cup: చెలరేగిన పాక్ బౌలర్లు.. తక్కువ స్కోరుకే బంగ్లాదేశ్ కట్టడి

  • 20 ఓవర్లలో 127/8 స్కోరు చేసిన బంగ్లా
  • ఓపెనర్ నజ్ముల్ శాంటో అర్ధ శతకం
  • 4 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిది
Pakistan bowlers restrict Bangladesh for 127 runs

టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ బెర్తు ఊరిస్తుండగా.. పాకిస్థాన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. సౌతాఫ్రికా రేసు నుంచి వైదొలగడంతో తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిస్తే సెమీఫైనల్ చేరే అవకాశం ఉండటంతో పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో అడిలైడ్ లో జరుగుతున్న సూపర్ 12, గ్రూప్ 2 మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 127/8 స్కోరుకే పరిమితం అయింది. ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (48 బంతుల్లో 7 ఫోర్లతో 54) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. మరో ఓపెనర్ లిటన్ దాస్ (10) నిరాశ పరిచినా వన్ డౌన్ లో వచ్చిన సౌమ్యా సర్కార్ (20)తో కలిసి శాంటో రెండో వికెట్ కు 52 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చాడు. దాంతో, 10 ఓవర్లకు బంగ్లా 70/1తో నిలిచి మంచి స్కోరు చేసేలా కనిపించింది. 

కానీ, సగం ఓవర్ల తర్వాత తర్వాత పాక్ బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా వికెట్లు పడగొట్టారు. శాంటో, సౌమ్యా సర్కార్ తో పాటు షకీబ్ అల్ హసన్ (0), మొసాదెక్ హొస్సేన్ (5), నురుల్ హసన్ (0), తస్కిన్ అహ్మద్ (1), నసుమ్ అహ్మద్ (7) పెవిలియన్ కు క్యూ కట్టారు. దాంతో, బంగ్లాదేశ్ వందలోపే పరిమితం అయ్యేలా కనిపించింది. చివర్లో అఫిఫ్ హొస్సేన్ (24 నాటౌట్) కీలక పరుగులు చేసి బంగ్లాకు గౌరవప్రద స్కోరు అందించాడు. పాక్ బౌలర్లలో యువ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. షాదాబ్ ఖాన్ రెండు, ఇఫ్తికార్ అహ్మద్, హారిస్ రవూఫ్ చెరో వికెట్ పడగొట్టారు. 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే పాక్ సెమీస్ చేరుతుంది. ఈ స్కోరును కాపాడుకుంటే బంగ్లాదేశ్ ముందుకొస్తుంది.

More Telugu News